సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్(ఏజీ) కోర్టుకు వెల్లడించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో రేపటి నుంచి పరీక్ష కేంద్రాలను ప్రారంభిస్తామని కూడా చెప్పారు. మాస్క్లు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టినట్లు కూడా చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని ఐపీఎం డైరెక్టర్ శంకర్ హైకోర్టుకు చెప్పారు.
కాగా.. కేరళ చేపట్టిన చర్యల్లో అనుసరనీయమైనవి ఉన్నాయా అని ఏజీని హైకోర్టు ప్రశ్రించింది. ఇందుకు ఏజీ కేరళ చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఇక్కడి డాక్టర్ల బృందం వెళ్లినట్లు తెలిపారు. ఇక అధిక ధరలకు మాస్క్లు, శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఏలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా 44 కరోనా కేసులు నమోదైనట్లు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కోర్టుకు సమాధానం ఇచ్చారు. కాగా మరిన్ని వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 23లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది.